15 ఏళ్ల తర్వాత 2011 ప్రపంచకప్ నాటి చేదు నిజం బయటపడింది. రోహిత్ శర్మను జట్టులో ఎందుకు తీసుకోలేదో మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ వివరించారు.
భారత క్రికెట్ చరిత్రలో 2011 ప్రపంచకప్ విజయం ఒక స్వర్ణయుగం. కానీ, ఆ జట్టులో స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ లేకపోవడం అభిమానులకు ఎప్పటికీ ఓ తీరని లోటు. తాజాగా, మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఒక పాడ్కాస్ట్లో ఆనాటి చేదు నిజాన్ని వెల్లడించారు. రోహిత్తో తాను అన్న మాటలను పంచుకున్నారు. ఆ నిర్ణయం వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని, కేవలం టీమ్ కాంబినేషన్ కోసమే తీసుకున్నామని తెలిపారు.
2011 వరల్డ్ కప్ ఎంపికల సమయంలో సెలెక్టర్లు ఆల్ రౌండర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. 1983 వ్యూహాన్నే అనుసరించారు. బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ ఉపయోగపడే ఆటగాళ్లు కావాలని భావించారు. అందుకే యూసఫ్ పఠాన్, యువరాజ్ సింగ్, సురేశ్ రైనా వంటి వారిని ఎంపిక చేయాల్సి వచ్చిందని, ఆ క్రమంలోనే అద్భుతమైన ఫామ్లో ఉన్న రోహిత్ శర్మకు చోటు దక్కలేదని శ్రీకాంత్ వివరించారు. రోహిత్ వంటి ప్రతిభావంతుడిని దూరం చేసుకోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ టోర్నమెంట్లో యువరాజ్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలవడం తమ వ్యూహం ఫలించినట్లు అనిపించినా, రోహిత్ శర్మ వంటి మేటి ఆటగాడిని మిస్ చేసుకోవడం బాధాకరమని శ్రీకాంత్ అన్నారు. రోహిత్ తన కెరీర్లో ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించినా, వన్డే ప్రపంచకప్ విజేతగా నిలవడం అతని చిరకాల కోరిక. 2023లో కెప్టెన్గా జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లినా, ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలయ్యాడు. శ్రీకాంత్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.