రిపోర్టర్: FutureAndhra News Desk | వర్గం: తెలంగాణ
లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై రేవంత్ రెడ్డి దక్షిణాది సీఎంలకు రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.. తెలంగాణ ప్రాతినిధ్యానికి ఇది కీలకమని, భవిష్యత్ రాజకీయ పవర్ పాలిటిక్స్కు ఇది నాంది కాబోతోందని విశ్లేషకులు చెబుతున్నారు..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై రాసిన లేఖ.. దేశ పవర్ పాలిటిక్స్లో సరికొత్త అధ్యాయానికి తెరలేపింది.. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందని, రాజకీయ ప్రాతినిధ్యం భారీగా తగ్గుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.. ఈ లేఖ ద్వారా రేవంత్ రెడ్డి కేవలం తెలంగాణ ముఖ్యమంత్రిగానే కాకుండా, దక్షిణాది గొంతుకగా మారే స్ట్రాటజీని అమలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు..
రేవంత్ రెడ్డి వ్యూహాత్మక డీల్..
దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో విజయం సాధిస్తే, ఇప్పుడు శిక్ష అనుభవించాల్సి వస్తుందన్నది ఈ డీల్ వెనుక కీలక వాదన.. పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గితే, కేంద్ర నిధులు, ప్రాజెక్టుల కేటాయింపుల్లో దక్షిణాది రాష్ట్రాలు బలహీనపడతాయి.. రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తడం ద్వారా, ప్రాంతీయ పక్షాలను ఏకం చేసి, బీజేపీని కౌంటర్ చేయాలని చూస్తున్నారు.. చంద్రబాబు, స్టాలిన్ వంటి సీనియర్ లీడర్లతో కలిసి ఒక బలమైన ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే ఆలోచన దీని వెనుక స్పష్టంగా కనిపిస్తోంది..
తెలంగాణకు తీవ్ర నష్టం..
లోక్సభ సీట్ల పునర్విభజన తెలంగాణ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది.. ఇప్పటికే అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాద్, ఇతర నగరాలకు, కరవు ప్రాంతాలైన మహబూబ్నగర్, నల్గొండ వంటి జిల్లాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు తగ్గిపోతాయి.. తెలంగాణ యువతకు, రైతులకు, ఉద్యోగులకు సంబంధించిన కీలక సమస్యలపై ఢిల్లీలో గట్టిగా మాట్లాడే గొంతుకలు తగ్గిపోతాయా..? ఇది కేవలం సీట్ల సర్దుబాటు కాదు.. రాష్ట్రాల అభివృద్ధి, హక్కులకు సంబంధించిన చాలెంజ్ అని రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇస్తున్నారు..
కేసీఆర్, బీజేపీకి కౌంటర్..?
ఈ విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేరళ సీఎం పినరయి విజయన్లను కూడా రేవంత్ ఏకం చేయడం కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో ఇమేజ్ తెచ్చిపెడుతుంది.. గతంలో ఫెడరల్ ఫ్రంట్ అంటూ కేసీఆర్ చేసిన ప్రయత్నాలను రేవంత్ రెడ్డి ఇప్పుడు హైజాక్ చేస్తున్నారనే విశ్లేషణ ఉంది.. బీజేపీ మాత్రం దీనిని ప్రాంతీయ విభేదాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది.. అయితే, 2028లో జరగబోయే డీలిమిటేషన్ ప్రక్రియ 2029 ఎన్నికల ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేయనుంది.. ఇది అసలు వార్కి ట్రైలర్ మాత్రమేనా..?
రేవంత్ రెడ్డి లేఖ కేవలం ఒక రాజకీయ ఎత్తుగడ మాత్రమే కాదు.. దక్షిణాది రాష్ట్రాల ఉనికి, సమాఖ్య స్ఫూర్తిపై జరుగుతున్న దాడిని ఎదుర్కొనే ప్రయత్నం.. ఈ ఐక్య పోరాటం ఎంతమేరకు ఫలితాలనిస్తుంది, కేంద్రంపై ఏ స్థాయిలో ఒత్తిడి తీసుకురాగలదు అనేది ఆసక్తిగా మారింది.. దక్షిణాది గొంతుకను ఢిల్లీలో బలంగా వినిపించాల్సిన చారిత్రక అవసరం ముందుంది..